అత్యాచారం కేసులో దోషిగా ప్రజ్వల్ రేవణ్ణ
కప్రత్యేక కోర్టు సంచలన తీర్పు
అక్షర కిరణం, (బెంగళూరు/జాతీయం): లైంగిక వేధింపులు, అత్యాచారం కసులో ఆరోపణలు ఎదుర్కొంటు న్న మాజీ ప్రధాన మంత్రి హెచ్డీ దేవెగౌడ మనవడు, జేడీఎస్ యువ నేత ప్రజ్వల్ రేవణ్ణను బెంగళూరులోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం దోషిగా నిర్దారించింది. రేవణ్ణ ఇంట్లో సహాయకురాలిగా పనిచేసిన వారి బంధు వైన మహిళపై అత్యాచారం కేసులో ఆయనను దోషిగా తేల్చింది. ఎంపీల/ ఎంఎల్ఏల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానం రేవణ్ణకు శనివారం శిక్షను ఖరారు చేయ నుంది. ఈ కేసులో విచారణ ముగియడంతో కొంత స్పష్టత అవసరం ఉందని పేర్కొంటూ జులై 30న తీర్పును వాయిదా వేసింది. శుక్రవారం (ఆగస్టు 1న) తీర్పును వెలువరించింది.
గతేడాది పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దోపిడీలు, దారుణాలు వెలుగులోకి రాగా.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ చివరి వారంలో తన దురాగతాలు వెలుగులోకి రావడానికి రెండు రోజుల ముందే ఆయన విదేశాలకు వెళ్లి పోయారు. తీవ్ర ప్రయత్నాలు అనంతరం రెండు నెలల తర్వాత స్వదేశానికి తిరిగివచ్చిన ప్రజ్వల్ను బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం లోనే అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన జైలులో ఉన్నారు.
బాధితురాలు ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీకి స్వయానా మేనత్త కుమార్తె. కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వంలో రేవణ్ణ మంత్రిగా ఉన్నప్పుడు ఆమెకు పాల కేంద్రంలో పని ఇప్పించారు. ఆ తర్వాత బీసీఎం హాస్టల్లో వంట మనిషిగా.. 2015లో ఆమెను వారి ఇంట్లో పనికి చేర్పించారు. ఆ ఇంటిలో పనికి చేరిన నాలుగు నెలల తర్వాత నుంచి ప్రజ్వల్ ఆమె లైంగిక దోపిడీకి పాల్పడుతూ వచ్చాడు. పండ్లు ఇచ్చే వంకతో స్టోరూమ్కు పిలిచి వేధించేవాడని, వంట గదిలో ఉన్నప్పుడు అసభ్యంగా తాకేవాడని బాధితురాలు వాంగ్మూలం ఇచ్చింది. ఒంటికి నలుగు, నూనె పెట్టి స్నానం చేయించాలని బాత్రూమ్కి తీసుకువెళ్లి లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డాడని ఆక్రోశించింది. విచారణలో ఇవన్నీ నిజమేన తేలడంతో ప్రజ్వల్ను కోర్టు దోషిగా నిర్దారించింది.
ఇక, ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యాలకు బలైపోయిన వారిలో మైనర్లు కూడా ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. బాధితుల్లో మైనర్లు నుంచి 50 ఏళ్లుపైబడి మహిళలు ఉన్నారనే ప్రధాన ఆరోపణ. జేడీఎస్ నేతపై ఫిర్యాదు చేసిన బాధితురాలు.. తన కుమార్తెకు వీడియో కాల్ చేసి అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపించారు. లైంగిక దాడులకు పాల్పడి.. వీడియోలు తీసి వాటి సాయంతో బాధితులను బెదిరించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. లోక్సభ ఎన్నికల సమయంలో ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజ్వల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోల్లో మహిళల ముఖాలు స్పష్టంగా కనిపించాయని పోలీసులు తెలిపారు