సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు
కడిబేట్లో వ్యాఖ్యలపై కేసు
కఆంధ్రప్రదేశ్కు తరలింపు
అక్షర కిరణం, (హైదరాబాద్): సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలోని కొమ్మినేని ఇంటికి వెళ్లిన ఏపీ పోలీసులు.. ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. తనని ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని కొమ్మినేని పోలీసుల్ని అడిగారు.. తాను సీనియర్ సిటిజన్ని ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. కొమ్మినేనిని హైదరాబాద్ నుంచి ఏపీకి తీసుకెళ్తున్నట్లు సమాచారం. అమరావతి ప్రాంత మహిళలను కించపరిచిన కేసులో పోలీసులు ఆయన్ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. కొమ్మినేని శ్రీనివాసరావుపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు సమాచారం.
ఇటీవల ఓ న్యూస్ ఛానల్ డిబేట్లో చర్చ సందర్భంగా కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటుగా మరో జర్నలిస్ట్ కృష్ణంరాజు.. తమను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని రాజధాని ప్రాంత రైతులు, మహిళలు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొమ్మినేని శ్రీనివాసరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అమరావతిలో మహిళలతోపాటుగా రాజధాని ప్రాంతంలో ఉన్న తాడికొండ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలోని దళిత మహిళలను అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కొమ్మినేనితో పాటుగా మరో జర్నలిస్ట్ కృష్ణంరాజు, ఆ న్యూస్ ఛానల్ యాజమాన్యంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు తెలుస్తోంది.
అమరావతి మహిళలను కించపరిచేలా ఓ డిబేట్లో వ్యాఖ్యలు చేశారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందించారు. ‘ఆడబిడ్డలను గౌరవించే సంస్కృతి మనది. స్త్రీమూర్తులను ఆరాధించే సమాజం మనది. ఇది మన సంప్రదాయం. మన భారతీయ జీవన విధానం. ముఖ్యంగా మన తెలుగు ప్రజల విషయానికి వస్తే ఆడబిడ్డను, అమ్మను ఎంతో ఆదరణతో చూస్తాం. అలాంటి మన రాష్ట్రంలో రాజకీయ కక్షతో, మీడియా విశ్లేషణల పేరుతో నిస్సిగ్గుగా ఏకంగా మన తల్లులు, చెల్లెళ్లపై దారుణ వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరం. వాళ్లు ఎప్పుడూ అనుసరించే ఈ విష సంస్కృతిపై తిరుగుబాటుగా గత ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చినా వారి వైఖరిలో మార్పు రాలేదనేది సుస్ఫష్టం. రాజధాని గురించి, ఆ ప్రాంత మహిళల వ్యక్తిత్వాలను అవమానించేలా వేశ్యలు అంటూ చేసిన దారుణ వ్యాఖ్యలను ఉపేక్షించే ప్రసక్తే లేదు. రాజకీయ, మీడియా ముసుగులో జరుగుతున్న ఇటువంటి వికృత పోకడలను తీవ్రంగా ఖండిస్తున్నాను’ అన్నారు.