కొమ్మినేని శ్రీనివాసరావు కేసులో ఎస్సీ, ఎస్టీ సెక్షన్లపై కోర్టు ఆగ్రహం
కఈ కేసులో ఆ సెక్షన్లు ఎలా నమోదు చేశారంటూ పోలీసులపై జడ్జి అభ్యంతరం
అక్షర కిరణం, (అమరావతి): అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో అరెస్టైన జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు కోర్టు రిమాండ్ విధించింది. ఈమేరకు 24వ తేదీ వరకు రిమాండ్ విధించగా.. పోలీసులు కొమ్మినేనిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఈ కేసులో కొమ్మినేని శ్రీనివాసరావుపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్లు ఎందుకు పెట్టారని జడ్జి పోలీసుల్ని ప్రశ్నించారు. అసలు ఆ సెక్షన్లు ఎలా వర్తిస్తాయని డీఎస్పీని ప్రశ్నించారు. అలాగే ఈ కేసు ఎఫ్ఐఆర్లో పరువు నష్టానికి సంబంధించిన సెక్షన్లు ప్రస్తావించి రిమాండ్ రిపోర్టులో ఎందుకు తొలగించారో చెప్పాలన్నారు. వీటిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
ఓ న్యూస్ ఛానల్లో నిర్వహించిన డిబేట్లో అమరావతి మహిళల్ని కించపరిచేలా వ్యాఖ్యానించారంటూ కొమ్మినేని శ్రీనివాసరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై బీఎన్ఎస్ 79, 196(1), 353(2), 299, 356(2), 61(1), 67 ఐటీ యాక్ట్, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు ఫైల్ చేశారు. ఆయన్ను హైదరాబాద్లో అరెస్ట్ చేసి గుంటూరుకు తరలించారు.. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో కొమ్మినేనికి రిమాండ్ విధించడం సరికాదని ఆయన తరపు లాయర్ వాదించారు. అర్నబ్ గోస్వామి కేసుతో సహా చాలా కేసులను ఉదహరించారు. అయితే వాటి వివరాలు ఇవ్వాలని కోర్టు కోరగా.. ఆయన సమయం అడిగారు. దీంతో జడ్జి విచారణను వాయిదా వేశారు.
కోర్టులో మళ్లీ విచారణ ప్రారంభమైన తర్వాత లాయర్ మహాభారతంలోని విషయాలు చెప్పగా జడ్జి అభ్యంతరం తెలిపారు. కేసుకి సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడాలన్నారు. వాదనలు విన్న తర్వాత జడ్జి కొమ్మినేనికి రిమాండ్ విధించారు. కొమ్మినేని శ్రీనివాసరావు జైలులో తనకు కొన్ని వసతులు కావాలని కోర్టును అడిగారు. తనకు 70 ఏళ్లని.. వయసు చూసి అయినా వసతులు కల్పించాలని ఆయన కోరారు. కొమ్మినేనికి జైలులో మంచం, పరుపు, దిండు వంటివి ఇవ్వాలని లాయర్ కోరారు. అయితే జైలు నిబంధనల ప్రకారం ఇస్తారని.. ఒకవేళ కోర్టు నుంచి ఆదేశాలు కావాలంటే పిటిషన్ దాఖలు చేయాలని జడ్జి సూచించారు.