టీడీపీ ప్రముఖ నేత తులసిబాబుకు పోలీసుల నోటీసులు
రాఘురామ కేసులో విచారణకు హాజరుకావాలంటూ ప్రకాశం జిల్లా ఎస్పీ నోటీిసు
రాజకీయ వర్గాల్లో కలకలం ఎమ్మెల్యే వెనిగండ్లకు తులసిబాబు బిజినెస్ పార్ట్నర్
అక్షర కిరణం, (విజయవాడ): ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, నరసాపురం మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు మరో మలుపు తిరిగింది. ఈకేసులో విచారణకు హాజరుకావా లని.. ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్.. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కమిటీ సభ్యుడు, టీడీపీ నేత కామేపల్లి తులసిబాబుకు నోటీసులు జారీ చేశారు. తులసిబాబు గుడివాడ నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్నారు. కామేపల్లి తులసిబాబు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు అత్యంత సన్నిహితుడు, బిజినెస్లో పార్ట్నర్.. దీంతో ఈ అంశం చర్చనీయాంశమైంది.
గుడివాడలో టీచర్స్ కాలనీ, పద్మనాభం ఆసుపత్రి వీధి పేరుతో తులసిబాబు ఉంటున్న ఇంటి అడ్రస్తో నోటీసులు జారీ చేశారు. రఘురామకృష్ణరాజును సీఐడీ అధికారుల కస్టోడియల్ టార్చర్ కేసులో తులసిబాబును విచారణకు పిలవడం ఆసక్తికరంగా మారింది. అలాగే ఈ కేసులో ప్రైవేట్ వ్యక్తిగా పిలవడం విశేషం. గత రెండేళ్లుగా తులసిబాబు గుడివాడ నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరించారు.. వైసీపీ నేతలపై పోరాటం చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. సార్వత్రిక ఎన్నికల్లో తులసిబాబు గుడివాడ ఎమ్మెల్యే రాముకు వ్యూహకర్తగా వ్యవహరించారు.
సార్వత్రిక ఎన్నికల వేళ గుడివాడ వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని.. తులసిబాబుకు అప్పటి ఎస్పీ ఆయనకు షాడో పార్టీని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అలాగే కస్టోడియల్ టార్చర్ కేసులో రఘురామకృష్ణరాజు తొలిసారి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ఫిర్యాదులో ఎక్కడా తులసిబాబు పేరు లేదంటున్నారు. గుడివాడ ఎమ్మెల్యే వెని గండ్ల రాము బావ జగన్మోహన్రావుకు తులసి బంధువు కావడంతో,, ఎమ్మెల్యేతో తులసికి మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే తనపై వస్తున్న ఆరోపణల అంశంపై తులసిబాబు ఇప్పటికే సీఎంవో కార్యాలయాన్ని సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు తులసిబాబుపై గిట్టనివారు దుష్ప్రచారం చేస్తున్నారని గుడివాడలో టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో సీఐడీ చీఫ్గా పనిచేసిన సునీల్ కుమార్కు ఎయిమ్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఉందట.. ఈ క్రమంలో సెఫాలజిస్టుగా పని చేసిన తులసిబాబుతో సునీల్కుమార్కు పరిచయాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రఘురామ కేసులో టీడీపీ నేతకు నోటీసులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ నోటీసుల అంశంపై తులసిబాబు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.