తిరుమల శ్రీవారికి భారీ వెండి కానుక
అక్షర కిరణం, (తిరుమల): కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి భక్తులు భారీఎత్తున విరాళాలు సమర్పిస్తారు. బంగారు, వెండి, ఇతర విలువైన ఆభరణాలు, వస్తువులను కానుకలుగా ఇస్తారు. ఎవరి స్తోమత బట్టి వారు స్వామికి విరాళాలు ఇస్తుంటారు. సాధారణంగా భక్తులందరూ కానుకలను ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీల్లో వేస్తారు. భారీ మొత్తంలో నగదు అయినా.. బంగారం, వెండి ఆభరణాలు ఉంటే హుండీలో వేయకుండా.. నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులకు అందజేస్తారు. ఈ క్రమంలోనే తాజాగా హైరాబాద్కు చెందిన ఓ వ్యక్తి స్వామి వారికి ఖరీదైన కానుకను సమర్పించారు.
22 కేజీల వెండితో..
హైదరాబాద్కు చెందిన జక్కారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అనే భక్తుడు మంగళవారం (నవంబర్ 4) తిరుమల శ్రీవారికి కానుక ఇచ్చారు. 22 కిలోల వెండితో చేసిన భారీ గంగాళా న్ని అందజేశారు. కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్న శ్రీనివాసులు రెడ్డి.. అనంతరం స్వామి వారికి రూ.30 లక్షలు విలువ చేసే వెండి గంగాళాన్ని విరాళంగా టీటీడీ అధికారులకు అందించారు. శ్రీనివాసులుకు ఆలయ అధికారులు.. స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.
రూ. 3.74 కోట్లు ఆదాయం
ఇదిలా ఉండగా, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆపదమొక్కులవాడు, వడ్డీకాసుల వాడు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. సోమవారం (నవంబర్ 3) 66,322 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. 26 వేల మంది తలనీలాలు సమర్పించుకున్నట్లు చెప్పారు. ఇక భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల శ్రీవారి హుండీకి రూ. 3.74 కోట్లు ఆదాయం వచ్చిన్నట్లు తెలిపారు.
రూ. 3.86 కోట్ల కానుక..
విశాఖపట్నంకు చెందిన వ్యాపారవేత్త, హిందుస్థాన్ ఎంటర్ ప్రైజెస్ ఎండీ పువ్వాడ మస్తాన్రావు.. తిరుమల శ్రీవారికి భారీ బంగారు కానుక అందజేశారు. ఆయన సతీమణి కుంకుమ రేఖతో కలిసి.. రూ.3.86 కోట్ల విలువైన బంగారు యజ్ఞోపవీతాన్ని స్వామి వారికి కానుకగా ఇచ్చారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు సమక్షంలో ఈ బంగారు యజ్ఞోపవీతం తీసుకొచ్చి అందజేశారు. అంతకుముందు ఈ ఏడాది సెప్టెంబర్లో విజయనగరం జిల్లాకు చెందిన భక్తుడు.. శ్రీవారికి రూ 10,00,116 (రూ. 10 లక్షలు) విరాళం ఇచ్చారు. కృష్ణ హరీష్ ఈశ్వర అనే వ్యక్తి.. ఈ మొత్తానికి సంబంధించిన డీడీని.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్యాంప్ కార్యాలయంలో ఆయనకు అందజేశారు. ఆ సమయంలో దాత.. కృష్ణ హరీష్ ఈశ్వర, బీఆర్ నాయుడు సహా బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కూడా పక్కనే ఉన్నారు. ఈ విరాళాన్ని టీటీడీకి చెందిన శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్ట్కు అందించాలని.. దాత టీటీడీ ఛైర్మన్కు విజ్ఞప్తి చేశారు.