మావోయిస్ట్లకు చావు దెబ్బ.. కీలక నేత హిడ్మా అరెస్ట్
అక్షర కిరణం, (ఒడిసా/జాతీయం): దేశంలో నక్సల్స్ ఉనికి లేకుండా చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి ప్రతిజ్ఞ చేసిన నేపథ్యంలో.. భారీగా భద్రతా బలగాలు రంగంలోకి దిగి.. మావోయిస్ట్ల ఏరివేత ఆపరేషన్లు చేపడుతున్నాయి. చర్చల కోసం మావోయిస్ట్లు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా.. కేంద్రం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. 2026 నాటికి దేశం లో మావోయిస్ట్లు లేకుండా చేస్తామని.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు మార్లు తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే గత కొన్ని నెలలుగా భద్రతా బలగాలు చేస్తున్న వరుస ఆపరేషన్ల లో భారీగా మావోయిస్ట్లు ప్రాణాలు కోల్పోతున్నారు. అడవు ల్లో జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు.. మావోయిస్టుల జాడ తెలుసుకుని వారిని హతం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక్కో ఆపరేషన్లో పదుల సంఖ్యలో మావోయిస్ట్లు నేల కొరుగుతున్నారు.
ఇటీవలె ఛత్తీస్గఢ్ నారాయణ్పూర్ జిల్లాలో జరిగిన భీకర ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత, పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజును భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇదే ఎన్కౌంటర్లో మరో 28 మంది మావోయిస్ట్లు కూడా భద్రతా బలగాల కాల్పుల్లో హతం అయ్యారు. ఈ క్రమంలోనే నంబాల కేశవరావు మృతి నుంచి ఇంకా మావోయిస్ట్లు తేరుకోకముందే.. వారికి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది.
మావోయిస్ట్ కీలక నేత, ఏరియా కమిటీ సభ్యుడు అయిన కుంజం హిడ్మా పోలీసులకు పట్టుబడ్డాడు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా బైపరిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని దట్టమైన పెటగుడ అటవీ ప్రాంతంలో కుంజం హిడ్మాను భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. దీంతో నక్సల్స్కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భద్రతా దళాలు కీలక విజయం సాధించినట్లు అయింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర 3 రాష్ట్రాలకు మోస్ట్ వాంటెండ్ నక్సలైట్గా హిడ్మా ఉన్నాడు. అతడిపై రూ.14 లక్షల రివార్డు కూడా భద్రతా బలగాలు ప్రకటించాయి. హిడ్మా స్వస్థలం ఛత్తీస్గఢ్లోని బిజాపూర్ జిల్లా మిర్తూర్. అయితే ఇప్పటికే పలుమార్లు హిడ్మా అరెస్ట్ అయ్యారని.. చనిపోయారని వార్తలు వచ్చాయి.
ఏరియా కమిటీ సభ్యుడు అయిన హిడ్మా.. ఆ ప్రాంతంలో 7 ప్రధాన హింసాత్మక ఘటనలకు కారణం అయినట్లు భద్రతా బలగాలు వెల్లడిరచాయి. హిడ్మా అరెస్ట్తో పాటు, అతని నుంచి ఒక ఏకే-47 రైఫిల్ సహా భారీ మొత్తంలో మావోయిస్టు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో ఒడిశాలో మావోయిస్టుల ప్రభావాన్ని తగ్గించడంలో ఒక పెద్ద విజయంగా భావిస్తున్నారు. హిడ్మా కార్యకలాపాలకు సంబంధించిన మిగిలిన మావోయిస్టు నెట్వర్క్లను ఛేదించడానికి అధికారులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.