14లోగా వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావలంటూ జగన్కు కోర్టు ఆదేశం
అక్షర కిరణం, (హైదరాబాద్): మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల లండన్ పర్యటనకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. అక్రమాస్తుల కేసులో బెయిల్ మీద ఉన్న వైఎస్ జగన్.. లండన్ పర్యటన కోసం నాంపల్లి సీబీఐ కోర్టు నుంచి అనుమతి తీసుకుని ఈ పర్యటనకు వెళ్లి వచ్చారు. లండన్లో ఉన్న పెద్ద కుమార్తెను చూడటం కోసం వైఎస్ జగన్ లండన్ పర్యటనకు వెళ్లగా.. సీబీఐ కోర్టు కొన్ని షరతులతో అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగానే లండన్ పర్యటన పూర్తి చేసుకుని వచ్చిన వెంటనే కోర్టు ఎదుట హాజరు కావాలంటూ సీబీఐ కోర్టు వైఎస్ జగన్కు సూచించింది. నవంబర్ 14వ తేదీలోపు తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలనే ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని అందులో కోరారు.
వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కోర్టు విధించిన గడువు పూర్తి కావస్తున్న నేపథ్యంలో.. వైఎస్ జగన్ కోర్టులో ఈ మెమో దాఖలు చేశారు. వ్యక్తిగత హాజరును మినహాయించాలని మెమోలో కోరారు. ఈ కేసులో తన తరుఫున న్యాయవాది హాజరయ్యేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. అలాగే తాను కోర్టు ముందు హాజరు కావాలంటే రాష్ట్ర యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందన్న జగన్.. ఇది యంత్రాంగానికి భారమని అభిప్రాయపడ్డారు.
ఈ విషయాలను పరిశీలించాలని మెమోలో కోరారు. ఒకవేళ తప్పనిసరిగా కోర్టులో హాజరుకావాలంటే తాను వచ్చేందుకు సిద్ధమేనని తెలిపారు. కోర్టు అనుమతితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యేందుకు తనకు ఇబ్బంది లేదని మెమోలో వైఎస్ జగన్ పేర్కొన్నారు. వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ వైఎస్ జగన్ దాఖలు చేసిన మెమో సీబీఐ కోర్టు పరిశీలనలో ఉంది. కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనేదీ తెలియాల్సి ఉంది.
మరోవైపు వైఎస్ జగన్ లండన్ పర్యటన కోసం కోర్టు కొన్ని షరతులు విధించింది. పర్యటన వివరాలు తెలియజేయటంతో పాటుగా, ఫోన్ నంబరు, ఈ-మెయిల్ వివరాలు సమర్పించా లని ఆదేశించింది. అయితే జగన్ లండన్ పర్యటన సమయం లో సొంత ఫోన్ నంబర్ ఇవ్వలేదంటూ సీబీఐ ఇటీవల పిటిషన్ వేసింది. జగన్ ఇచ్చిన ఫోన్ నంబర్ పనిచేయలేదని.. మూడుసార్లు ఫోన్ చేసినా పనిచేయలేదని పిటిషన్ వేసింది. ఉద్దేశపూర్వకంగా పని చేయని ఫోన్ నంబర్ ఇచ్చి.. బెయిల్ నిబంధనలు ఉల్లంఘించిన వైఎస్ జగన్కు, మరోసారి విదేశీ పర్యటనలకు అనుమతి ఇవ్వొద్దంటూ సీబీఐ పిటిషన్ వేసింది. అయితే వైఎస్ జగన్ అసలు ఫోన్ వాడరని ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ఆయన తరుఫు న్యాయవాదులు వాదించారు. జగన్ తన సిబ్బంది ఫోన్ నంబర్లు ఇస్తారని.. గతంలోనూ ఇలాగే ఇచ్చారని కోర్టుకు తెలిపారు. ఇరువర్గాల వాదనలను విన్న సీబీఐ కోర్టు.. సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది.