నవజాత శిశువుకు తప్పుడు ఇంజెక్షన్
కచేయి తొలగింపు కపోలీసులకు ఫిర్యాదు
అక్షర కిరణం, (గ్రేటర్ నోయిడా/జాతీయం): ఉత్తర ప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా ప్రాంతంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఒక నవజాత శిశువుకు తీరని అన్యాయం జరిగింది. ఒక ప్రైవేటు నర్సింగ్ హోమ్లో ఇచ్చిన తప్పుడు ఇంజెక్షన్ కారణంగా ఆ పసికందు చేయిని పూర్తిగా తొలగించాల్సిన భయంకరమైన పరిస్థితి ఏర్పడిరది. అసలు ఏం జరిగిందంటే..?
అక్టోబర్ 5వ తేదీన జన్మించిన ఓ ఆడ శిశువు అనారోగ్యం తో బాధ పడుతుండటంతో.. కుటుంబ సభ్యులు కొన్ని రోజుల తర్వాత గ్రేటర్ నోయిడాలోని గోపాల్ నర్సింగ్ హోమ్లో చికిత్స కోసం తరలించారు. ఈక్రమంలోనే శిశువుకు అక్కడి వైద్యులు చికిత్సలో భాగంగా ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. అయితే ఆ ఇంజెక్షన్ కారణంగా ఆ పసికందు చేయి తీవ్రంగా ఉబ్బి, నీలం రంగులోకి మారడం ప్రారంభించింది. అయితే విషయం గుర్తించిన తల్లిదండ్రులు.. పదే పదే వైద్యులకు విషయం చెప్పారు. చిన్నారి చేయి ఉబ్బుతోందని, నీలం రంగులోకి మారుతోందని ఆవేదన చెందారు. కానీ సిబ్బంది మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
ముఖ్యంగా చిన్నారి చేతికి బ్యాండేజ్ చుట్టి.. వెంటనే మరో ఆస్పత్రికి వెళ్లాల్సిందిగా సూచించారు. అక్కడి నుంచి ఇంకొక ఆసుపత్రికి తరలించినప్పటికీ.. శిశువు పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు. ప్రస్తుతం ఆ నవజాత శిశువు చేయి తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా కుళ్లిపోయే దశకు చేరుకుంది. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆ ఇన్ఫెక్షన్ శరీరమంతా వ్యాపించకుండా ఉండాలంటే, ఆ పసికందు చేతిని తొలగించడం తప్పనిసరిగా మారింది. నర్సింగ్ హోమ్ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డకు ఈ దుస్థితి దాపురించిందని ఆరోపిస్తూ.. నవజాత శిశువు తండ్రి బలేశ్వర్ భాటి పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఈ దారుణ సంఘటన పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆసుపత్రి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. వెంటనే ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై గౌతమ్ బుద్ధ నగర్ ముఖ్య వైద్య అధికారికి పోలీసులు లేఖ పంపారు.
ఈ సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి.. వైద్యుల నిర్లక్ష్యం ఉంటే తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా విచారణ కమిటీని ఏర్పాటు చేసి, వెంటనే నివేదిక సమర్పించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. చికిత్స కోసం నర్సింగ్ హోమ్కు వెళ్లిన పసికందుకు ఇలాంటి భయంకరమైన పరిస్థితి ఎదురుకావడం స్థానికంగా కలకలం రేపింది.