సంక్షేమం, అభివృద్ధిలో దూసుకెళుతున్నాం
కస్వాతంత్య్ర దిన వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కరాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు
అక్షర కిరణం, (విజయవాడ): సంక్షేమం, అభివృద్ధి, మంచి పాలనతో ఏడాది పాలన జరిగిందన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రజల మద్దతు, తమ సంకల్పం, దేవుడి దయతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని.. కూటమి ప్రభుత్వంలో సంక్షేమానికి ఎదురులేదని, అభివృద్ధికి ఆటంకం లేదని, మంచి పాలనకు పోటీ లేదన్నారు. ఇది రికార్డు.. ఇదే ఆల్టైమ్ రికార్డు అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్స వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఎన్డీయే కూటమిని గెలిపించారని.. రాష్ట్రం నిలబడాలనే నినాదంతో ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారన్నారు. కూటమికి 94 శాతం స్ట్రైక్ రేట్తో, 57 శాతం ఓట్లతో ప్రజలు మద్దతు తెలిపారన్నారు. రాష్ట్రాన్ని మళ్లీ నిర్మించాలనే లక్ష్యంతో పాలన మొదలు పెట్టామని.. అధికారం చేపట్టిన ఏడాదిలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా పని చేశామన్నారు.
2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత, ప్రజలు తనకు మొదటి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారని చంద్రబాబు అన్నారు. అనుభవం, ప్రజల సహకారంతో రాష్ట్రాన్ని దేశంలోనే టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలిపామని ఆయన చెప్పారు. తర్వాత ఆయన ఈ విషయాలు తెలిపారు. 2019లో వచ్చిన ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసిందని, ఏపీ బ్రాండ్ను దెబ్బతీసిందని, వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఆయన విమర్శించారు. దీనివల్ల రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పులు చేసిందని.. బకాయిలతో ఆర్థికంగా రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. ఆ ఐదేళ్లలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని, కనీసం రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదన్నారు. రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి తన ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా, భవిష్యత్తుకు బాటలు వేసేలా పని చేశామని.. విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తున్నామన్నారు.
‘దేశంలో మరే రాష్ట్రంలో అమలు కాని స్థాయిలో రెట్టింపు సంక్షేమం ప్రజలకు అందుతోంది. ప్రధాన ఎన్నికల హామీలుగా ఉన్న సూపర్ సిక్స్ను సూపర్ హిట్ చేశాం. ‘పేదల సేవలో’ కార్యక్రమంలో 64 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇంటివద్దే పంపిణీ చేస్తూ సంక్షేమ రాజ్యానికి కొత్త అర్థాన్ని ఇచ్చాం. తన బిడ్డ చదువుకోవాలని కలలుకనే పేదింటి తల్లులకు ఆర్ధిక భరోసా ఇచ్చేందుకు ‘తల్లికి వందనం’ పథకాన్ని తీసుకువచ్చాం. రూ.10 వేల కోట్లతో పథకాన్ని అమలు చేశాం. అన్నదాత సుఖీభవలో మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, కేంద్రం రూ.2 వేలు కలిపి మొత్తం రూ.7 వేలు రైతుల ఖాతాల్లో వేశాం. 47 లక్షల మంది రైతులకు రూ.3,173 కోట్లు అందించాం. దీపం పథకం కింద ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఏటా రూ.2,684 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇప్పటికి 2 కోట్ల రాయితీ సిలిండర్లు ఇచ్చాం. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ‘స్త్రీ శక్తి’ పేరుతో ఉచిత ప్రయాణాన్ని కానుకగా ఇస్తున్నాం’ అన్నారు.
‘16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించాం. ఈ నెలఖరుకు నియామకాలు పూర్తి చేస్తాం. ప్రజలకు నాడు కునుకు లేకుండా చేసిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ను రద్దు చేశాం. పేద ప్రజల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు తిరిగి తీసుకువచ్చాం. 204 అన్నా క్యాంటిన్లలో 5.16 కోట్ల మందికి రూ.5 లకే కడుపునింపాం. దేవాలయాల్లో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణుల కనీస వేతనం రూ.25 వేలకు పెంచాం. దేవాలయ ట్రస్ట్ బోర్డుల్లో చోటు కల్పించాం. 40 వేల సెలూన్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. మేనిఫెస్టోలో చెప్పినట్లు కల్లు గీత కార్మికులకు 10 శాతం మద్యం దుకాణాలు, బార్లు కేటాయించాం. మత్స్యకారులకు వేట విరామ సమయంలో రూ.20 వేలు ఆర్ధిక సాయాన్ని ఇస్తున్నాం. చేనేతకు అండగా హ్యాండ్లూమ్స్కు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్స్కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. ఎస్సీ సామాజిక వర్గాల్లో అంతరాలు తగ్గించేలా...ఏ వర్గాన్ని నొప్పించకుండా, ఏ ఒక్కరూ నష్టపోకుండా ఎస్సీ వర్గీకరణతో వారి దశాబ్దాల ఆకాంక్ష నెరవేర్చాం. ‘అడవితల్లి బాటలో’ కార్యక్రమం ద్వారా రూ.1,000 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టాం. మారుమూల గిరిజన ప్రాంతాలను ప్రధాన రహదారులతో కనెక్ట్ చేస్తున్నాం’ అని వివరించారు.