38 టన్నెళ్లు.. 927 బ్రిడ్జిల మీదుగా వందేభారత్ రైలు..
కఈనెల 19న ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
అక్షర కిరణం, (కశ్మీర్/జాతీయం): జమ్మూ కాశ్మీర్లో తొలిసారి వందే భారత్ రైలు సర్వీసులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ వందే భారత్ రైలును ఏప్రిల్ 19వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించను న్నారు. ఈ తొలి వందే భారత్ రైలు.. కాట్రా నుంచి కాశ్మీర్కు పరుగులు పెట్టనుంది. ఉదంపుర్-శ్రీనగర్- బారాముల్లా మధ్య 272 కిలోమీటర్ల మేర ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన రైలు లింక్ ప్రాజెక్ట్ పూర్తి అయిన నేపథ్యంలో ఈ వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 19వ తేదీన ప్రధాని మోదీ ఉదంపుర్ వస్తారని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెల్లడిరచారు. ఈ రైలుతో కాశ్మీర్ వాసుల ఏళ్ల నాటి కల నెరవేరనుంది.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన అయిన చీనాబ్ బ్రిడ్జిని సందర్శించి.. ప్రారంభిస్తారని జితేంద్ర సింగ్ తెలిపారు. ఆ తర్వాత కాట్రా నుంచి వందేభారత్ రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ప్రస్తుతం జమ్మూ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నందున జమ్మూ- కాట్రా- శ్రీనగర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ మొదట కాట్రా నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ రైలు లింక్ ప్రాజెక్ట్ గత నెలలోనే పూర్తి అయి.. సక్సెస్ఫుల్గా ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. రైళ్లను నడిపేందుకు రైల్వే సేఫ్టీ కమిషన్ కూడా ఆమోద ముద్ర వేసినట్లు అధికారులు వెల్లడిరచారు.
ఈ వందే భారత్ రైలు ప్రారంభోత్సవంతో కాశ్మీర్కు ప్రత్యక్ష రైలు అనుసంధానం చేపట్టాలని ఎన్నో ఏళ్లుగా ఉన్న డిమాండ్ నెరవేరనుంది. ప్రస్తుతం కాశ్మీర్ లోయలోని సంగల్డాన్, బారాముల్లా మధ్య.. అలాగే కాట్రా నుంచి దేశంలోని మిగతా గమ్యస్థానాలకు మాత్రమే రైల్వే సర్వీసులు ఉన్నాయి. ఈ రైలు ప్రారంభం అయితే నేరుగా సర్వీసులు నడవనున్నాయి. కాశ్మీర్ను రైల్వే సర్వీసులతో అనుసంధానించే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు 1997లోనే ప్రారంభమైనప్పటికీ.. అనేక సవాళ్లు, ప్రతికూల పరిస్థితుల కారణంగా తీవ్ర ఆలస్యం జరిగిందని అధికారులు వెల్లడిరచారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 119 కిలోమీటర్ల పొడవునా 38 టన్నెల్స్ ఉన్నాయి. వీటిలో 12.75 కిలోమీటర్ల మేర నిర్మించిన టీ-49 సొరంగం అత్యంత పొడవైనదని అధికారులు తెలిపారు. అలాగే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో 927 బ్రిడ్జిలు కూడా ఉన్నాయి. ఇందులో చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి కూడా ఉంది. దీని ఎత్తు 359 మీటర్లు కాగా.. పారిస్లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్తో పోలిస్తే 35 మీటర్లు ఎక్కువ ఎత్తు ఉండటం గమనార్హం.