దేవుడికి హారతి ఇస్తూ తీవ్రంగా గాయపడిన కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్
అక్షర కిరణం, (రాజస్థాన్ /జాతీయం): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్ అగ్ని ప్రమాదానికి గురయ్యారు. తన ఇంట్లో పూజ చేసుకుంటుండగా.. ఈ ప్రమాదం సంభవించింది. ముందుగానే దేవుడి ముందు దీపం పెట్టిన ఆమె హారతి ఇచ్చేందుకు పైకి లేవగా... ఆమె చున్నీకి దీపం ఆనుకుని మంటలు అంటుకున్నాయి. క్షణాల్లోనే అవి ఒళ్లంతా వ్యాపించి బట్టలన్నీ కాలిపోయాయి. ఆమె అరుపులతో పూజ గదికి వచ్చిన కుటుంబ సభ్యులు వెంటనే మంటలు ఆర్పేశారు. ఆపై ఆమెను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అహ్మాదాబాద్లోని మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. వివరాలు ఇలా ఉన్నాయి.
రాజస్థాన్లోని ఉదయ్ పూర్ నివాసంలో ప్రతి రోజూ లాగే పూజ చేసుకునేందుకు సిద్ధం అయ్యారు కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్. ప్రస్తుతం 78 ఏళ్ల వయసు కల్గిన ఆమె ఉదయమే లేచి దేవుడికి పూజ చేసుకుంటున్నారు. ముందుగానే దేవుడి పటం ముందు దీపం పెట్టిన ఆమె.. ఆపై హారతి ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు. పైకి లేచి హారతి ఇస్తుండగా.. కింద ఉన్న దీపం ఆమె దుపట్టాకు అంటుకుంది. ఫలితంగా మంటలు అంటుకుని.. ఆమె గుర్తించేలోపే ఒళ్లంతా అంటుకున్నాయి. మంటల వేడికి ఒళ్లంతా కాలుతుండగా.. ఆమె కేకలు వేసింది. దీంతో సూర్య నమస్కారం చేసుకునేందుకు బయటకు వెళ్లిన ఆమె సోదరుడు గోపాల్ కృష్ణ వర్మ.. వెంటనే లోపలికి వచ్చారు. నీళ్లు, టవల్తో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఆలోపే మిగతా ఇంటి సభ్యులు కూడా వచ్చి సాయం చేయగా.. మంటలు ఆర్పేశారు. ఆపై వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు.. మెరగైన చికిత్స కోసం ఆమెను అహ్మాదాబాద్లోని మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో వెంటనే ఆమెను ఆహ్మాదాబద్ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. గిరిజా వ్యాస్ రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా మరియు మహిళా కమిషన్ జాతీయ అధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. అలాగే ఆమె ఇండియా కాంగ్రెస్ కమిటీ మౌత్ పీస్ సందేశ్ పాత్ర్కాకు చీఫ్ ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. 1986 నుంచి 1990 వరకు రాష్ట్ర పర్యాటకశాఖ సహాయ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత ఏఐసీసీ సభ్యురాలిగా ఏడాది పాటు ఉన్నారు. 1991లో ఉదయ్పూర్ నుంచి తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. ఈక్రమంలోనే ఆమెకు సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి పదవి లభించింది. 1993లో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 1996లో 11వ, 1999లో 13 లోక్సభకు ఎన్నికయ్యారు.