టికెట్ కోసం సీఎం ఇంటి ముందు బైఠాయించిన సిట్టింగ్ ఎమ్మెల్యే
అక్షర కిరణం, (బీహార్/జాతీయం): బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార, ప్రతిపక్ష కూటముల్లో టికెట్ల రచ్చ తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా అధికార కూటమిలోని జేడీయూ పార్టీలో తీవ్ర అసంతృప్తి రాజుకుంది. సిట్టింగ్ స్థానం దక్కకపోవడంతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గోపాల్ మండల్ ఏకంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నివాసం ఎదుటే బైఠాయించి నిరసన తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష కూటములు సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపికలతో బిజీగా ఉన్నాయి. మొదటి దశ పోలింగ్కు నామినేషన్ల దాఖలుకు మరో నాలుగు రోజులే గడువు ఉన్నప్పటికీ.. ఎన్డీయే, మహాఘట్ బంధన్ కూటములు ఇంకా తమ అభ్యర్థుల జాబితాలను పూర్తి స్థాయిలో ప్రకటించలేదు.
ఈ క్రమంలోనే అధికార కూటమిలో భాగంగా జేడీయూ తన సిట్టింగ్ స్థానమైన గోపాల్పూర్ను మిత్రపక్షమైన బీజేపీకి కేటాయించింది. దీనితో ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తనకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని కోరుతూ గోపాల్ మండల్ మంగళవారం ఉదయం సీఎం నితీశ్ కుమార్ నివాసానికి వెళ్లారు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం తో.. సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను లోపలికి అనుమతించలేదు.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే గోపాల్ మండల్.. సీఎం నితీశ్ కుమార్ ఇంటి గేటు ముందు బైఠాయించి నిరసనకు దిగారు. ఉదయం 8.30 గంటల నుంచే తాను ఇక్కడ ఎదురు చూస్తున్నానని.. తనకు టికెట్ లభించే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని తెగేసి చెప్పారు. నేను కచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ పొంది తీరుతానని శపథం చేశారు. అది దక్కకుండా ఇక్కడ నుంచి అస్సలే వెళ్లనని ఆయన పట్టుబట్టారు.
గోపాల్ మండల్ మాత్రమే కాకుండా.. వివిధ నియోజక వర్గాలకు చెందిన జేడీయూ కార్యకర్తలు కూడా సీఎం ఇంటి ముందు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొత్తులో భాగంగా బీజేపీ నేతలకు టికెట్లు ఇచ్చి.. తమ సొంత పార్టీ నేతలకు అన్యాయం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు సీఎం నివాసం చుట్టూ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.