విద్యార్థులకు దండం పెట్టి.. గుంజీలు తీసిన హెడ్మాస్టర్
విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టేందుకు తనను తాను శిక్షించుకున్న గురువు
సోషల్మీడియాలో వైరల్ ఇప్పుడైనా మంచి మార్కులు తెచ్చుకుంటారేమోనన్న హెచ్ఎం
అక్షర కిరణం, (విజయనగరం): గురువు తల్లి, తండ్రి, దైవం అంటూ.. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుకు ఇచ్చారు. విద్యార్థుల జీవితాలను మంచి మార్గంలో నడిపిస్తూ వారికి విద్యాబుద్ధులు నేర్పించడంలో గురువు పాత్ర చాలా గొప్పది. కొన్ని సందర్భాల్లో కొందరు గురువులు విద్యార్థుల్ని క్రమశిక్షణ లో పెట్టేందుకు ఒకటి రెండు, మాటలు అంటుంటారు.. అప్పుడప్పుడు బెత్తం దెబ్బలు తప్పవు. కానీ ఈ గురువు మాత్రం అందుకు భిన్నం.. విద్యార్థులు చేసిన తప్పును తన తప్పుగా భావించి.. తనకు తాను శిక్ష వేసుకున్నారు. విద్యార్థుల్ని పల్లెత్తు మాట అనకుండా తనను తాను శిక్షించుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియో బాగా వైరల్ అవుతోంది.
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట గ్రామం జెడ్పీ స్కూల్లో ఈ ఘటన జరిగింది. హెచ్ఎం విద్యార్థులకు దండం పెట్టి గుంజీలు తీసిన వీడియో వైరల్ అవుతోంది. ఏం జరిగిందని ఆరా తీస్తే అసలు సంగతి తెలిసింది. స్కూల్లో కొంతమంది విద్యార్థులు చదువులో వెనుక బడ్డారు.. బాగా చదవకపోవడంతో మార్కులు సరిగా రాలేదు. అయితే విద్యార్థుల్ని కొట్టినా, తిట్టినా తిరిగి టీచర్లపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నారట. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ హెడ్మాస్టర్ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం ప్రార్థన సమయంలో హెచ్ఎం రమణ.. విద్యార్థులంతా నిలబడి ఉండగా.. అందరికి సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీశారు.
‘మేము కొట్టలేము.. తిట్టలేము.. ఏమి చేయలేము.. మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు’. మాకు చేతనైనా వరకు మేం చేస్తున్నాం.. మీ పిల్లల్నీ మీరు కంట్రోల్ చేయకపోతే పాఠశాలకు పంపించడం వృథా అవుతుంది. ఈ రోజుల్లో చదవడం లేదని విద్యార్థులను కొట్టినా, తిట్టినా మాపై ఫిర్యాదులు చేస్తున్నారని అందుకే కొట్టకుండా తిట్టకున్న విద్యార్థులు నమస్కారం చేసి గుంజీలు తీశాను’ అంటూ రమణ చెప్పుకొచ్చారు. ఇలా చేస్తేనైనా విద్యార్థులు బాగా చదువుకుని, మంచి మార్కులు తెచ్చుకుంటారనే ఉద్దేశంతో.. హెడ్మాస్టార్ రమణ ఇలా సాష్టాంగ నమస్కారం ద్వారా గుంజీలు తీశారని స్కూల్లో ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ గురువు ఎంత గొప్పవారు అంటూ చర్చించుకుంటున్నారు.